హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో భాగంగా నిర్మించిన నాగోల్ ఫ్లై ఓవర్ను రాష్ట్ర మున్సిపల్ మంత్రి కే తారకరామారావు బుధవారం ప్రారంభించారు.
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ (ఎస్ఆర్డీపీ) కింద రూ.143.58 కోట్ల వ్యయంతో నాగోల్ చౌరస్తా నుంచి నాగోల్ మెట్రోస్టేషన్ వరకు ఈ ఫ్లై ఓవర్ను నిర్మించారు. దాదాపు కిలోమీటర్ పొడవున్న ఈ ఫ్లైఓవర్ను ఆరు లేన్ల మార్గంగా రూపొందించారు. ఈ ఫ్లైఓవర్తో ఉప్పల్ ఎల్బీనగర్ మధ్య ట్రాఫిక్ రవాణా మరింత సులభతరం కానుంది. ఎస్ఆర్డీపీ కింద నిర్మించిన ఫ్లైఓవర్లలో ఇది 16వది కావడం విశేషం.