తాడూరు, సెప్టెంబర్ 9: నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చేపట్టిన పదేండ్ల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో మొదలైన పాదయాత్ర.. నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల మీదుగా చర్లతిర్మలాపూర్ వరకు 10 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈ యాత్రకు మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు.
తాడూరులో బార్బర్ దుకాణంలో ఎమ్మెల్యే ఓ వ్యక్తికి గడ్డం గీశారు. కూరగాయల మార్కెట్లో టమాటాలు తూకం వేశారు. స్టేషనరీ దుకాణంలో వస్తువులు అమ్మారు. చికెన్ సెంటర్లో చికెన్ కొట్టారు. వ్యవసాయ పొలంలో కూలీలతో కలిసి ఎమ్మెల్యే మర్రి భోజనం చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను బతికున్నంత వరకూ ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని, తద్వారా పేదలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.