నల్లగొండ : నిడమనూరు మండల పరిధిలోని వేంపాడు సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడింది. సాయంత్రం కాల్వ అడుగు భాగాన ఉన్న యూటిలో నుంచి నీరు లీకవుతూ కొద్ది సేపటికే అది పెద్ద గండిలా మారింది. దీంతో కాల్వ కట్ట కోతకు గురై ఆ నీరంతా వృధాగా దిగువన ఉన్న పంట పొలాల్లోకి ప్రవేశిస్తుంది. గండి మరింత వెడల్పు కావడంతో పెద్ద ఎత్తున నీరు సమీపంలోని మిర్యాలగూడ – హలియా ప్రధాన రహదారి పైకి వచ్చి చేరుతుంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ముందస్తుగా వాహనాలను మరో మార్గంలో పోలీసులు దారి మళ్లించారు. ఈ నీటితో దగ్గరలోని నర్సింహాపురంతో పాటు పలు గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉన్నది.