న్యూస్నెట్వర్క్, ఆగస్టు 11: నాగార్జునసాగర్కు ఆదివారం 1,20,528 క్యూసెక్కుల వరద రాగా, 8 క్రస్ట్ గేట్లను ఎత్తి 63,120 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకుగాను ప్రస్తుతం 588 (306.1010 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉన్నది. ఆదివారం సెలవు రోజు కావడంతో డ్యామ్ అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా జూరాల ప్రాజెక్టుకు 65 వేల క్యూసెక్కుల వరద రాగా.. 3 గేట్లు ఎత్తి 62,725 క్యూసెక్కులను వదిలారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 89,417 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఆరు గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 2,28,634 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకుగాను ప్రస్తుతం 199.7354 టీఎంసీలుగా ఉన్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్కు ఆదివారం 3,41,350 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. దీంతో మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం బరాజ్కు 4,500 క్యూసెక్కుల నీరును వస్తుండగా, 66 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి వరద తగ్గుతున్నది. ఎగువనుంచి 4,39,600 క్యూసెక్కుల వరద వస్తుండగా 59 గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది ఆదివారం సాయంత్రం 3.41 క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్హౌస్కు జలాలు చేరుతుండగా, ఆదివారం 5వ నంబర్ మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్కు తరలిపోతున్నాయి. ఇక్కడ ఆదివారం 5వ నంబర్ మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల నీటిని శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు.
కాగా, ఆదివారం సాయంత్రం వరకు ఎల్లంపల్లి నుంచి 13.2 టీఎంసీలకు పైనే జలాలు మధ్య మానేరుకు తరలించినట్టు అధికారులు తెలిపారు. మధ్యమానేరు నుంచి సిరిసిల్ల జిల్లాలోని అన్నపూర్ణ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నారు. మధ్యమానేరు నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా తిప్పాపూర్లోని సర్జ్పూల్కు జలాలు చేరుతుండగా, ఇక్కడ పంప్హౌస్లో రెండు బాహుబలి మోటర్ల ద్వారా 6,440 క్యూసెక్కులు అన్నఫూర్ణ జలాశయానికి తరలిస్తున్నారు. ఇక్కడ జలాశయం గేట్లు తెరిచి అంతే మొత్తంలో రంగనాయక సాగర్కు వదులుతున్నారు.