Nagam Janardhan Reddy | నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా పని చేయడంతోపాటు శాసన మండలిలో పార్టీని అధికార బీఆర్ఎస్లో విలీనం చేసిన నేర చరిత్ర గల దామోదర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం దారుణమని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. పార్టీలో చేరినప్పటి నుంచి కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేసిన తనకు టికెట్ నిరాకరించడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని తన ఇంట్లో నాగం జనార్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలపై పార్టీ పిలుపులను జయప్రదం చేశానన్నారు.రాహుల్ గాంధీ పర్యటన విజయవంతానికి వేల మందిని తరలించిన తనను కాదని, నియోజకవర్గ ఎల్లలు తెలియని వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. మూడుసార్లు వరుసగా ఓటమి పాలైన నేతకు టికెట్ ఇవ్వవద్దన్న ఉదయ్పూర్ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయరన్నారు.
ఉదయ్పూర్ డిక్లరేషన్ను తుంగలో తొక్కి, సర్వేల పేరిట టికెట్ కేటాయించడం సరి కాదని నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. తాను కష్టపడితే ఇతరులకు టికెట్ ఎలా కేటాయిస్తారని, వారికి ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. తాను ఎప్పుడు సొంత నిర్ణయం తీసుకోలేదని, కార్యకర్తల అభిప్రాయం మేరకే పని చేస్తానని నామినేషన్ గడువులోపు తన వైఖరిని స్పష్టం చేస్తానని తెలిపారు. టికెట్ కేటాయింపులో తనకు జరిగిన నమ్మకద్రోహం పై జాతీయ పార్టీ దృష్టి సారించాలని చెప్పారు. తనను బుజ్జగించేందుకు వచ్చిన మాణిక్యం ఠాక్రే, జానారెడ్డి, చిన్నారెడ్డి లాంటి నాయకులకు తాను పరిస్థితి వివరించానన్నారు. తనను రాజీ పడమని అడిగే హక్కు పార్టీ నేతలకు లేదని అన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఆహ్వానాలు వచ్చాయని, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని జనార్ధన్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, వివిధ మండలాల అధ్యక్షులు కోటయ్య, లక్ష్మయ్య, మిద్దె రాములు, అర్జునయ్య, పాండు, నిజాం సత్యం, భీముడు, అహ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు