హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సంబంధించి సీబీఐ నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని, నిందితుల జాబితాలోనూ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులపై ఆమె స్పందించారు. సీబీఐకి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీ ఆధారంగా నమోదుచేసిన ఎఫ్ఐఆర్ కాపీని అందించాలని కోరుతూ ఇటీవల సీబీఐకి లేఖ రాయగా, అధికారులు స్పందిస్తూ ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇచ్చారని.. ఎఫ్ఐఆర్ కాపీ వెబ్సైట్లో ఉన్నదని తెలిపారని వెల్లడించారు.
సీబీఐ వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ని క్షుణ్ణంగా పరిశీలించానని, నిందితుల జాబితాను కూడా చూశానని పేర్కొన్నారు. ఎక్కడా తన పేరు లేని విషయాన్ని గుర్తించానని సోమవారం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖరాశారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల మంగళవారం సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. 11, 12, 14, 15 తేదీల్లో అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టంచేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని కోరారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, ఆ కేసు దర్యాప్తునకు సహకరిస్తానని పునరుద్ఘాటించారు.