హైదరాబాద్, డిసెంబర్21 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం పట్టణంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలను పలు మీడియా చానళ్లు వక్రీకరించాయని, అది తగదని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాస్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించొద్దని కోరారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, ప్రభుత్వ పనితీరు వల్ల, ఆరోగ్యశాఖలోని పైస్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల సహకారం వల్ల, అన్ని మతాల వారి ప్రార్థనల వల్లే కరోనా సమసిపోయిందని ఆ వేడుకల్లో వ్యాఖ్యానించినట్టు ఆయన వివరించారు. కానీ కేవలం క్రీస్తు ద్వారానే కరోనా పోయిందని అన్నట్టు అర్థం వచ్చేలా తన ప్రసంగ వీడియో క్లిప్ కట్ చేసి కొంతమంది ప్లే చేస్తున్నారని, కావాలనే వివాదాన్ని సృష్టిస్తున్నారని వాపోయారు.