Mahmood Ali | బీఆర్ఎస్ నర్సాపూర్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డికి ముస్లింలు మద్దతు ఇవ్వాలని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు. నర్సాపూర్లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో, తొమ్మిది సంవత్సరాల తెలుగుదేశం పాలనలో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదన్నారు.
కాంగ్రెస్ పాలనలో హిందూముస్లింల మధ్య నిత్యం గొడవలు జరిగేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో హిందూముస్లింలు కలసిమెలసి జీవిస్తున్నారన్నారు. మిలాద్ ఉన్ నబీ, వినాయక నిమజ్జనోత్సవం ఒకేరోజు రావడంతో.. మిలాద్ ఉన్ నబీని వాయిదా వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ముస్లిం విద్యార్థుల కోసం ఎన్నో రెసిడెన్షియల్ పాఠశాలలను కళాశాలను ఏర్పాటు చేసిందన్నారు. విదేశాలలో చదివే పేద ముస్లిం విద్యార్థులకు రూ.20లక్షలు ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేశారన్నారు.
ఇమామ్లకు గౌరవ వేతనం ఇచ్చి గౌరవిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.24 కోట్లు షాదీ ముబారక్ పథకం కింద అందజేయడం జరిగిందన్నారు. కేసీఆర్లాంటి మనిషి దేశంలో ఎవరూ లేరని.. కాంగ్రెస్ హయాంలో ఒక్క ముస్లిం వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ముస్లింలకు సముచితస్థానం కల్పించి గౌరవించారన్నారు. రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తని.. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్నారని విమర్శించారు.