హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ల బిల్లు తీసేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. కేంద్ర హోంమంత్రి ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. కేంద్రంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన హోంమంత్రి మతతత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం దురదృష్టకరమని చెప్పారు. గతం లో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్ని మతాలను, కులాలను కలుపుకొనిపోవాలని కీలక సమావేశాల్లో చెప్పారన్న సంగతి గుర్తు చేశారు.
దళితులు, గిరిజనుల కంటే ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని గతంలో సీపీఐ నాయకులు చండ్రరాజేశ్వర్రావు చేసిన పరిశీలనలో వెల్లడైందని తెలిపారు. సచార్, శ్రీరంగరాజ కమిటీ పరిశీలనలో కూడా ముస్లింలు ఎక్కువ శాతం పేదరికంలో ఉన్నారని నివేదిక ఇచ్చిన సంగతి గుర్తుచేశారు.