హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): దేశంలో ముస్లింలను కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. చేవెళ్లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై అసదుద్దీన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో మతాన్ని ఆధారంగా చేసుకుని ముస్లింలు రిజర్వేషన్లు పొందటం లేదని, రిపోర్టుల ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలిపారు. ఈ విషయం బీజేపీకి అర్థం కాకపోవటం వాళ్ల మూర్ఖత్వానికి నిదర్శనమని చెప్పారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ముస్లింలపై బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. దేశంలో యువత నిరుద్యోగంతో బాధపడుతున్నదని, చైనా సరిహద్దు సమస్య దేశాన్ని వేధిస్తున్నదని.. కానీ ఇవేమీ బీజేపీకి, హోంమంత్రి అమిత్షాకు కనిపించవని మండిపడ్డారు.