హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో తెలంగాణకు చెందిన వివాహిత దారుణ హత్యకు గురయ్యింది. శనివారం మధ్యాహ్నం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆమె మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు ఈ విషయాన్ని బంధువులకు చేరవేశారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ నాయకులు మాదగాని బాల్శెట్టిగౌడ్, మాధవి దంపతుల కుమార్తె చైతన్య (శ్వేత) మాదగాని తన భర్త అశోక్రాజ్తో కలిసి విక్టోరియా రాష్ట్రంలోని పాయింట్కుక్ సమీపంలో గల మిర్కావేలో నివాసం ఉంటున్నది. వారికి మూడేండ్ల బాబు ఉన్నాడు. ఇటీవల భర్త అశోక్రాజ్, కుమారుడితో విదేశాలకు వెళ్లారు. ఈ క్రమంలో వారి నివాసానికి సుమారు 86 కిలోమీటర్ల దూరంలోని మౌంట్ పొల్లాక్ రోడ్డు పక్కన ఓ చెత్తబుట్టలో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు విచారణ చేపట్టి చెత్తబుట్టలోని మృతదేహం మాదగాని శ్వేతదని తేల్చారు.
వెంటనే రంగంలోకి దిగిన హోమిసైడ్ స్కాడ్ డిటెక్టివ్లు ఆధారాలు సేకరిస్తున్నారు. స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్వేత నివాసానికి వెళ్లి పలు ఆధారాలు సేకరించారు. శ్వేత చాలా మంచిదని, తమ కోసం అప్పుడప్పుడు ఆహార పదార్థాలు వండి తీసుకొస్తుంటారని, తాను చనిపోయిందంటే నమ్మలేకపోతున్నామని ఇరుగుపొరుగువారు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్వేత మరణంపై ఆమె భర్తకు సమాచారం అందించిన పోలీసులు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. భర్త, కుటుంబ సభ్యులు చెప్పే వివరాల ఆధారంగానే శ్వేత హత్య మిస్టరీ వీడనున్నది.