చండూరు : మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రచారానికి నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ చండూరు మండలం బోడంగిపర్తి గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్రమంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో ఘనస్వాగతం పలికారు. పడమటి తల్లా గ్రామంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా డప్పు కొట్టడం విశేషంగా ఆకట్టుకుంది. వివిధ పార్టీల నుంచి వచ్చిన కార్యకర్తలకు టీఆర్ఎస్ కండువా కప్పి స్వాగతం పలికారు.
నాంపల్లి మండలంలోని తిరుమలగిరిలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మైనారిటీ నాయకులతో సమావేశమై టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారంలో పాల్గొన్నారు. చండూరు లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ న్యాయవాదులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు.
యాదగిరిగుట్ట కొండపైకి నడిపే ఆటో కార్మికులు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలియజేస్తూ సమావేశాన్ని నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర నాయకులు పల్లా వెంకటరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొని సంఘీభావం తెలిపారు.