హైదరాబాద్ : సూర్యాపేటతో సరిసమానంగా మునుగోడును తీర్చిదిద్దుతామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడి శాసన సభ్యుడికి వ్యాపకాలు, వ్యాపారాలు ఎక్కువేనని ఆయన ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పాలనలో ఇలాంటి నేతల ఎదుగుదలతో సరిసమానంగా ఫ్లోరోసిస్ పెరిగిందన్నారు.
కొత్తగా మండలంగా రూపాంతరం చెందిన గట్టుప్పల్ మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసం సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చండూరు జెట్పీటీసీ కర్నాటి వేంకటేశం తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజల్లో ఆదరణ కొల్పయిందన్నారు. మోసకారి పార్టీగా ప్రజల్లో ఆ పార్టీకి గుర్తింపు వచ్చిందన్నారు. ప్రధాని మోదీ పన్నుల ప్రధానిగా ఘనత కెక్కారని ఆయన ఎద్దేవాచేశారు. అందుకే యావత్ తెలంగాణా సమాజం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.
గట్టుప్పల్ మండల ఏర్పాటు ప్రజల కల అని,ఆ కలను సాకారం చేసిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ నేతల తో పాటు పెరిగి మునుగోడు ను కబళించిన ఫ్లోరోసిస్ ను నివారించింది కుడా ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు.
జాతీయ,అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేలలో ఫ్లోరోసిస్ కేసు నమోదు కాలేదు అంటే అది ముమ్మాటికీ సీఎం కేసీఆర్ గొప్పతనమేనన్నారు. దాంతో ప్రజల్లో పెరిగిన విశ్వసనీయతకు టీఆర్ఎస్ చేరేందుకు బారులు తీరుతున్న ఉదంతాలే నిదర్శనమన్నారు.