హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరారు. పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ లో చేరారు.
ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డిలు వారికి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని పట్టిపీడించిన ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించిన నాయకుడు కేసీఆర్ అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొత్తగా ఒక్క ఫ్లోరైడ్ కేసు నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిందన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కలిపిస్తామని హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్లో చేరిన వారిలో రాష్ట్ర సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు, రావి గూడెం సర్పంచ్ గుర్రం సత్యం, కుంట్ల గూడెం సర్పంచ్ మీరాళ్ల పారిజాతం గోపాల్, కిష్ట పురం సర్పంచ్ నందిపాటి రాధ రమేష్, చూళ్లేడు సర్పంచ్ జనిగెల మహేశ్వరి సైదులు, కాల్వల పల్లి సర్పంచ్ వి.జగన్, కిష్టపురం ఎంపీటీసీ సైదులు ఉన్నారు.