మునుగోడు/మునుగోడు రూరల్, అక్టోబర్ 14: ‘ఇన్నేండ్లకెల్లి నువ్వు జేసిందేంది.. ఇండ్లు, స్కూళ్లు కట్టిస్తనని చెప్పినవ్.. వాటి సంగతేంది’? అని సోలిపురం గ్రామస్థులు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిని నిలదీశారు. సమాధానం చెప్పలేనోడివి ఇక్కడికెందుకు వచ్చినవని మండిపడ్డారు. రాజగోపాల్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామంలో ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. దాంతో ఆయన సమాధానం చెప్పలేక అక్కడి నుంచి జారుకొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి మునుగోడు మండంలోని సోలిపురం గ్రామానికి రాజగోపాల్రెడ్డి, బీజేపీ నేతలు వచ్చారు. గత ఎన్నికల ప్రచారంలో ఆ గ్రామానికి సొంత నిధులతో బ్రిడ్జి నిర్మిస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చనందున ప్రచారం చేయద్దని గ్రామస్థులు అడ్డుకొన్నారు.
‘ప్రభుత్వం నిధులిచ్చినా, ఇవ్వకపోయినా గ్రామానికి సొంత నిధులతో బ్రిడ్జి కట్టిస్తానని 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే చెప్పినవ్. గెలిచిన తర్వాత మా ఊరికి ఒక్కసారి రాలే. ప్రభు త్వం నిధులు ఇయ్యలేదని చెప్పి బీజేపీలో చేరినవు.. ఇప్పుడు మళ్ల గెలిస్తే కూడా నీది ప్రతిపక్షమే కదా! అలాంటప్పుడు ఈ నియోజకవర్గం ఎలా అభివృద్ధి అయితది? ఈ ఉప ఎన్నికలో నీకు ఓట్లేస్తే ప్రయోజనం ఉండదు. నీ సొంత లాభం కోసమే పార్టీ మారినవ్. మళ్లీ గెలిపిస్తే అభివృద్ధి చేస్తాననుకుంటూ ప్రచారం చేయడం సిగ్గుగా లేదా?’ అని యువకులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాజగోపాల్రెడ్డి అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు.