హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మోదీది మొదటినుంచి అమ్ముడు, కొనుడు సిద్ధాంతమేనని టీఆర్ఎస్ నేత దాసో జు శ్రవణ్ ఆరోపించారు. దేశంలో ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాల కూల్చివేత ఓ క్రూరమైన రాజకీయ ప్రవృత్తి అని మండిపడ్డారు. మునుగోడు ఉపఎన్నిక కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వలాభం కోసం, బీజే పీ స్వార్థం కోసం వచ్చిందని చెప్పారు. పలు అంశాలపై దాసోజు శ్రవణ్ ‘నమస్తే’తో ముచ్చటించారు. ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే..
మోదీకి.. ఎమ్మెల్యేలను కొనడం అలవాటే
మోదీకి ఎమ్మెల్యేలను కొనడం కొత్తేం కాదు. ఇప్పటికే అనేక రాష్ర్టాల్లో కొనుగోళ్లు జరిపారు. ఇప్పుడు తెలంగాణలో అడుగు పెట్టా రు. ఎమ్మెల్యేల కొనుగోలు ఓ క్రూరమైన రాజకీయ ప్రవృత్తి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక విలువలను మోదీ ఖూనీ చేస్తున్నారు. తాను మాత్రమే ఏకఛత్రాధిపత్యం చలాయించాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. స్వార్థపూరితం గా, నియంతృత్వ పోకడలు పోతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చే హక్కు మోదీకి ఎక్కడిది? ఈ వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్న రు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నరు.
ఉప ఎన్నిక.. 18 వేల కోట్ల కోసమే!
మునుగోడు ఉపఎన్నిక.. ప్రజల కోసమో, అభివృద్ధి కోసమో వచ్చింది కాదు. ఒక వ్యక్తి కాంట్రాక్టుల కోసం, లాభాపేక్ష కోసం, ఒక పార్టీ స్వార్థ రాజకీయం కోసం వచ్చిన ఎన్నిక. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించారు.
బీజేపీ మ్యానిఫెస్టో ఓ డ్రామా..
తెలంగాణలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని మరే రాష్ట్రంలో లేవు. ఆ విషయం ప్రజలకు తెలుసు. అందుకే కదా.. దేశమంతా కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నది. మరి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏం జరుగుతున్నది? అక్కడి సంక్షేమ పథకాలేంటి? అభివృద్ధి కార్యక్రమాలేంటి? అన్నీ ప్రజలకు తెలుసు. దేశంలో అధికారంలోనే ఉన్నారు కదా? మరి అక్కడెందుకు చేయడం లేదు? తెలంగాణలో ఎలాగూ అధికారంలో లేరు కదా? మరి ఇక్కడెట్ల చేస్తరు? ఈ విషయం ప్రజలందరికీ అర్థమైంది. బీజేపీ నేతలకే అర్థంకాకపోవడం హాస్యాస్పదం.
మోదీ.. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం..
రాష్ర్టాలకు ఉన్న ఫెడరల్ స్ఫూర్తిని మోదీ సర్వనాశనం పట్టిస్తున్నరు. రాష్ర్టాలను సామంతరాజులుగా మార్చుకోవాలని, ఆయనో నియంతలా పాలించాలని కలలు కంటున్నరు. అందులో భాగంగానే ప్రభుత్వాలను పడగొట్టడం, ఎమ్మెల్యేలను కొనడం చేస్తున్నరు.
మునుగోడు ఫలితంతో బీజేపీకి గుణపాఠం
రాజ్యాంగాన్ని బేఖాతరు చేసేవాళ్లకు రాజ్యాధికారం చెలాయించే హక్కు ఎక్కడిది? ఈ ఎన్నిక వెనుక ఉన్న కాంట్రాక్టుల కోణాన్ని, బీజేపీ స్వార్థాన్ని మునుగోడు గుర్తించింది. సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధం.