చౌటుప్పల్: మునుగోడులో ఓడిపోతామనే భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ నాయకులు తెర తీశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రశాంతంగా నడుస్తున్న సర్కారును పడగొట్టాలని కుట్ర చేశారని, అందులో భాగంగానే ఒక్కో ఎమ్మెల్యేను రూ.100 కోట్లతో కొనాలని చూశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజగోపాల్ రెడ్డి లా తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేసిన బీజేపీ నేతల తీరును నిరసిస్తూ నల్ల చొక్కా ధరించి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అప్పుడు చంద్రబాబు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని రేవంత్ రెడ్డి ద్వారా కుట్రలు చేసి దొరికిపోయారని, ఇప్పుడు బీజేపి నేతలు అదే చేయబోరని విమర్శించారు. మోదీ కూడా అచ్చం చంద్రబాబులానే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్కో ఎమ్మెల్యే కు రూ. 100 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయాలని చేసిన కుట్ర బట్టబయలు అవడంతో బీజేపీ నీచ రాజకీయం తేటతెల్లం అయ్యిందని తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని బీజేపీ కొనుగోలు చేసినట్లు తమ ఎమ్మెల్యేలను ఎవరూ కొనలేరని మంత్రి పేర్కొన్నారు.
అదాని, అంబానీలకు దేశాన్ని తాకట్టుపెట్టగా వచ్చిన సొమ్ముతో ఇలా ఎమ్మెల్యేలను కొనే కుట్రలు చేస్తున్నారని ఫైరయ్యారు. దేశంలో ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తున్నదని.. సీఎం కేసీఆర్ ముందు బీజేపీ కుప్పిగంతులు సాగవని అన్నారు.
దేవుళ్ల పేరిట యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నా.. బీజేపీ నేతల బండారం బట్టబయలుకావడంతో వారు ఆ పార్టీకి దూరమవుతున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 70 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న సర్కారు తమదని స్పష్టం చేశారు. ఆసరా పింఛన్లతో వృద్ధుల్లో భరోసా లభించిందన్నారు. తెలంగాణ వచ్చాక కరువు అనేదే లేదని అన్నం పెట్టే ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని మంత్రి కోరారు.