చౌటుప్పల్: ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి రాజీనామా చేసి ముగ్గురు ఎమ్మెల్యేలున్న పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డి ఏం అభివృద్ధి చేస్తాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కోమటిరెడ్డి అసలు ఎందుకు రాజీనామా చేశాడో.. ఓటు వేసే ముందు ఒక్కసారి ప్రజలు ఆలోచించాలన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా చౌటుప్పల్ మండలంలోని కాట్రేవు, ఆరేగూడెం గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగేండ్ల కష్టాన్ని తీర్చుకునే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని, దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యే ఉన్న కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలన్ని కోరారు.
పక్కనే ఉన్న కర్ణాటకలో ఉన్న బీజేపీ అధికారంలో ఉన్నదని, అక్కడ రూ.2016 పింఛన్లు లేవని, గొర్రెల కాపరులకు సాయం లేదని, కల్లు గీత కార్మికులను అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల తర్వాత ఆ నియోజకవర్గాలకు కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. నియోజకవర్గంలో సబ్బండ వర్గాలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయని చెప్పారు. దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ప్రజలంతా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
ఉప ఎన్నికల్లో గెలవబోయే ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆరేగూడెం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డి గెలిచిన తర్వాత నియోజకవర్గం మొఖం చూడలేదని విమర్శించారు. ఎప్పుడూ జనం మధ్యే ఉన్న ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
నిత్యం ప్రజల మధ్యే ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్న తనను మరోసారి గెలిపించాలని పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలానికి సాగునీటిని తీసుకువచ్చానని, దండు మల్కాపురంలో కాంగ్రెస్ సర్కారు తీసుకువచ్చిన డంపింగ్ యార్డును తొలగించి.. వెయ్యి ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయించామని తెలిపారు. ప్రజల మధ్య ఉండే తనుకు ఓటేస్తారో.. నియజవర్గానికి దూరంగా ఉండి ఎమ్మెల్యే పదవిని బీజేపీకి అమ్ముకున్న రాజ గోపాల్ రెడ్డికి ఓటు వేస్తారో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.