భీమ్గల్/బాల్కొండ/మోర్తాడ్/ఏర్గట్ల, నవంబర్ 11: బీసీల జోలికి వస్తే ఖబడ్దార్ మోదీ అంటూ మున్నూరు కాపు సంఘాల నేతలు హెచ్చరించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇండ్లు, వ్యాపార సంస్థలపై జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులను నిరసిస్తూ శుక్రవారం నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల మున్నూరు కాపు సంఘ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
భీమ్గల్, బాల్కొండ, కమ్మర్పల్లి, ఏర్గట్ల మండల కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం కావాలనే తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై కక్షగట్టి ఈడీ, ఐటీ అధికారులతో దాడులు చేయించి ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. తక్షణమే ఈడీ దాడులను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీకి బుద్ధిచెప్తామని హెచ్చరించారు. బీసీ బిడ్డ ఎదుగుదలను ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని మండిపడ్డారు.