హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో నగర, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటేశారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది. అడపాదడప ఉద్రిక్తతలు మినహా ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకోవడంలో ఉత్సాహం చూపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) బుధవారం రాత్రి విడుదల చేసిన గణాంకాల ప్రకారం 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం పోలింగ్ నమోదైంది.
ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో మాత్రం 66.05 శాతం మాత్రమే నమోదైంది. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. మొత్తం 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉన్నది. శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపుతో వారి భవితవ్యం తేలనున్నది. భారీగా నమోదైన పోలింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలిస్తుందనే ఉతంఠ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెలకొన్నది.
భారీ భద్రత నడుమ బ్యాలెట్ పెట్టెలను ఎన్నికల అధికారులు స్ట్రాంగ్రూమ్లకు తరలించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు పలుచోట్ల స్వతంత్రులు కూడా తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ సరళిని బట్టి ఎవరికి పట్టంగట్టారో తెలుసుకోవడానికి అటు అభ్యర్థులు, ఇటు ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై, సాయంత్రంలోగానే తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నది. గెలుపు గుర్రాలు ఎవరో తేలిపోయే ఆ రోజు కోసం రాజకీయ వర్గాల్లో అప్పుడే ఉతంఠ మొదలైంది.
ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకాగా, ఉదయం నుంచే ఓటర్లు క్యూలో బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 11.6%, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 48.54%, మధ్యాహ్నం 3 గంటల వరకు 62.09%, పోలింగ్ ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్త సగటు పోలింగ్ 75.88%గా నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 91.91 % పోలింగ్ నమోదై అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత నల్లగొండ జిల్లాలోని చండూరు 91.52%తో తర్వాత స్థానంలో ఉన్నది. అత్యల్పంగా ఇదే జిల్లాలోని సాగర్ (నందికొండ) మున్సిపాలిటీలో 59.68% నమోదైంది.
మున్సిపల్ కార్పొరేషన్లలో రాష్ట్రవ్యాప్తంగా సగటున 66.05% పోలింగ్ మాత్రమే రికార్డయింది. కొత్తగా ఏర్పాటైన నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 77.36% పోలింగ్తో టాప్లో నిలిచింది. ఆ తర్వాత కొత్తగూడెం కార్పొరేషన్ 74.52%లో రెండోస్థానంలో నిలిచింది. రామగుండం 69.32, మహబూబ్నగర్ 67.73, మంచిర్యాల 64.90, కరీంనగర్ 62.98, నిజామాబాద్ కార్పొరేషన్లో 59.12% చొప్పున పోలింగ్ నమోదైంది.
ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లలో 28.80 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈ సారి పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఓటు హకు వినియోగించుకోవడం విశేషం. చౌటుప్పల్ మున్సిపాలిటీ వంటి ప్రాంతాల్లో మహిళా ఓటింగ్ శాతం 92.04శాతానికి చేరుకోవడం వారి చైతన్యానికి నిదర్శనం.
గత ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. గతంలో 71.15% పోలింగ్ నమోదు కాగా, ఈసారి 73.01% నమోదైంది. నాడు పురుషుల ఓట్లు 70.53% ఉండగా, ఇప్పుడు 72.63 శాతంగా నమోదైంది. నాడు మహిళల ఓటింగ్ శాతం 71.78 ఉండగా, ఇప్పుడు 73.39 శాతంగా నమోదైంది.