ములుగు, జూన్11(నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ (47) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హనుమకొండ స్నేహనగర్లో ఉంటున్న ఆయన ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఇంట్లో స్నానం చేసి బయటకు వస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. గన్మెన్ల సాయంతో భార్య రమాదేవి వెంటనే ఆయనను హనుమకొండలోని లైఫ్లైన్ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు హైదరాబాద్కు తరలించాలని సూచించగా సమయం లేకపోవడంతో అక్కడే అజార దవాఖానకు తీసుకెళ్లారు.అక్కడ చికిత్స అందిస్తుండగానే కన్నుమూశారు. జదీశ్వర్ మృతి విషయం తెలిసిన సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. జిల్లాలోని మల్లంపల్లికి చెందిన జగదీశ్వర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట ఉన్నారు.
14 ఏండ్లపాటు హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోనే ఉంటూ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల సమయంలో ములుగు నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించారు. ములుగు జిల్లా ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం కల్పించారు. అంతలోనే ఆయన మృతి చెందడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఏప్రిల్ 1న జగదీశ్వర్ తొలిసారి గుండెపోటుకు గురికాగా భార్య రమాదేవి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్లో చికిత్స తీసుకున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న నిర్వహించిన సంక్షేమ సంబురాల్లోనూ పాల్గొన్నారు. నేడు మల్లంపల్లిలో జరగనున్న జగదీశ్వర్ అంత్యక్రియలకు మంత్రి కేటీఆర్ హాజరవుతారు.
అండగా ఉంటామని సీఎం హామీ
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ హఠాన్మరణంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగదీశ్వర్ అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాల్సిందిగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని ఆదేశించారు.
జగదీశ్వర్ అకాల మృతికి మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఇటీవల తాను ములుగులో పర్యటించినప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని, అంతలోనే ఆయన మృతి చెందడం ఆవేదన గురిచేసిందని ట్వీట్ చేశారు. మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, నిరంజన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, కడియం శ్రీహరి, డాక్టర్ బండాప్రకాష్, తక్కళ్లపల్లి రవీందర్రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, మానుకోట మాజీ ఎంపీ సీతారాం నాయక్, రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ తదితరులు జగదీశ్వర్ మృతికి సంతాపం తెలిపారు.