Congress Leader | ములుగు, మార్చి 10 (నమస్తేతెలంగాణ): ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు, మంత్రి సీతక్క అనుచరుడు బానోత్ రవిచందర్.. తమకు భూమి ఇప్పిస్తానని మోసం చేశాడని ఇద్దరు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన ములుగు మండలం జీవంతరావుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని సమ్మయ్యనగర్ కాలనీలో భూమి ఇప్పిస్తానని 2013లో నిగ్గుల సుధాకర్ నుంచి రవిచందర్ రూ.లక్షా 80 వేలు తీసుకున్నాడు. 9 ఏండ్లుగా భూమి ఇప్పించకుండా.. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా మాయమాటలు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. తాను, మంత్రి సీతక్క కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని, సమ్మయ్యనగర్ కాలనీలో సుధాకర్కు రావాల్సిన భూమిని వేరే వారికి విక్రయించాడు. తమకు వేరే చోట భూమి ఇప్పిస్తామని నమ్మబలికాడు.
తీరా డబ్బులు వాడుకుని ముఖం చాటేశాడు. దీంతో ఆవేదనకు గురైన నిగ్గుల సుధాకర్, అతని భార్య శారద గ్రామంలోని తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటామని పెట్రోల్ బాటిల్ పట్టుకుని తలుపులు మూసుకున్నారు. విషయం తెలుసుకున్న ములుగు ఎస్సై-2 రామకృష్ణ అక్కడికి వెళ్లి కిటికీలో నుంచి సుధాకర్ను సముదాయించే ప్రయత్నం చేయగా.. వారు రవిచందర్ చేసిన మోసాన్ని ఎస్సైకి వివరించారు.
తమకు న్యాయం చేయాలని మంత్రి సీతక్కను కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించినా.. మంత్రిని కలువకుండా రవిచందర్ అడ్డుకున్నారని వాపోయారు. దీంతో ఎస్సై.. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్కు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు. స్పందించిన అశోక్.. సుధాకర్తో ఫోన్లో మాట్లాడారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని, ఆత్మహత్య లాంటివి ఏమి చేయొద్దని, మంత్రి సీతక్క ఇతర పనుల్లో బిజీగా ఉన్నారని, ధైర్యంగా పోరాడేందుకు ముందు రావాలని సుధాకర్కు వివరించాడు. అశోక్ హామీతో సుధాకర్, అతని భార్య శారద ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఎస్సై వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.