మల్యాల, ఫిబ్రవరి 22 : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రావద్దని వేడుకొంటూ మల్యాల మండలం ముత్యంపేట వాసులు ముడుపు కట్టారు. కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయడమే కాకుండా, ఆలయాన్ని దేశంలోనే గొప్పక్షేత్రంగా తీర్చిదిద్దుతానని, అవసరమైతే వెయ్యి కోట్లయినా ఇస్తానని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అంజన్న ఆలయ పునర్నిర్మాణంతోపాటు ఆలయ పరిసరాలు అభివృద్ధి జరగాలని కోరుకుంటూ బుధవారం మల్యాల మండలం ముత్యంపేట గ్రామస్థులు తమ గ్రామ పరిధిలో ఉన్న కొండగట్టుకు 3 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేపట్టారు.
ముత్యంపేట-కొండగట్టు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇంటికొకరు చొప్పున కదిలారు. సుమారు వెయ్యి మందికిపైగా గ్రామ పంచాయతీ నుంచి పాదయాత్రగా బయలుదేరి, ఘాట్రోడ్డు గుండా కొండపైన ఉన్న వై జంక్షన్ వద్దకు చేరుకున్నారు. వై జంక్షన్ వద్ద సీఎం కేసీఆర్ కటౌట్కు క్షీరాభిషేకం చేసి, ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, ముడుపు కట్టారు. నాడు కొండగట్టును ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు సీఎం కేసీఆర్ చొరవతో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని వారన్నారు.