హుజూరాబాద్, అక్టోబర్ 26 : కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లి గ్రామస్థులు బీఆర్ఎస్కు జైకొట్టారు. 500 మంది గురువారం గులాబీ గూటికి చేరారు. హుజూరాబాద్లోని సాయి కన్వెన్షన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్లోకి వచ్చిన వారిలో బీజేపీ నుంచి ఎక్కువ మంది ఉండగా, ఇందులో పెద్ద ఎత్తున ముదిరాజ్ కులస్థులు ఉండటం గమనార్హం. ఈటల రాజేందర్ సామాజిక వర్గం వారే బీఆర్ఎస్లో చేరి ఆయనకు షాక్ ఇచ్చారు. ఈ సందర్బంగా బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్లీ ఆగమైపోతామని, వాళ్ల చేతిలో రాష్ర్టాన్ని పెడితే కుక్కలు చింపిన విస్తరి చేస్తారని హెచ్చరించారు. ప్రజలందరికి ప్రగతి ఫలాలు అందాలంటే మూడోసారి బీఆర్ఎస్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేశ్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.