రవీంద్రభారతి, నవంబర్ 21: అన్ని కులవృత్తుల డీఎన్ఏ ఒక్కటేనని, ముదిరాజ్లు ఐక్యంగా ఉండి రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆబార్కీ, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్, మహమూద్అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డ తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కుల వృత్తులను ప్రోత్సహించి ఆర్థికంగా ఎదగడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు.
కుల సంఘాలు ఆత్మగౌరంతో జీవించడానికి, ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి ఎకరం భూమితో పాటు రూ.5 కోట్లు కేటాయించారని వివరించారు. అలాగే వెనుకబడ్డ కులాలవారి పిల్లలు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటుచేసి విద్యాపరంగా తోడ్పాటునందించారని అన్నారు. తెలంగాణలో చేపల పెంపకం కోసం రూ.185 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. అనంతరం హోంశాఖ మంత్రి మహమూద్అలీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు.
బడుగు బలహీనవర్గాల కోసం అనేక పథకాలతోపాటు రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతులను రాజులుగా చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఘర్షణలు లేకుండా ప్రజలు శాంతియుతంగా ఉన్నారని చెప్పారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం కృషిచేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి తోడ్పాటునందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్నరామూర్తి, కార్పొరేటర్ సామల హేమ, సలహాదారుడు పిట్టల రవీందర్, గుండ్లపల్లి శ్రీనుముదిరాజ్, జగన్ ముదిరాజ్, గుర్రాల మల్లేశం, ప్రొఫెసర్ దినేశ్ తదితరులు పాల్గొన్నారు.