BRS Party | హైదరాబాద్ : హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకుడు ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తిరిగి గులాబీ గూటికి చేరుకున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్లోనే ఉండేవారు. అయితే ఆయనకు టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. రామ్మోహన్ గౌడ్, ఆయన భార్య, కార్పొరేటర్ లక్ష్మీప్రసన్నలకు గులాబీ కండువా కప్పి మంత్రి హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. రామ్మోహన్ గౌడ్తో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ‘రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడు. మాతో కలిసి పని చేశాడు. సహచరుడిని కాపాడుకోవాలని ఇక్కడకు వచ్చాను. కష్టకాలంలో పార్టీ కోసం పని చేశాడు. ముక్కు సూటితత్వం ఉన్న మనిషి. రెండు సార్లు టికెట్ ఇచ్చాం, కానీ స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు తోడ్పాటు అందించారు. 11 మంది కార్పొరేటర్లను ఆయనే గెలిపించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి టికెట్ ఆశించి భంగపడ్డారు. రామ్మోహన్ గౌడ్కు బీఆర్ఎస్ పార్టీ తగిన ప్రాధాన్యమిస్తుంది. ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు తగిన అవకాశాలు ఉంటాయి. పార్టీ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. అందుకు నేనే బాధ్యత తీసుకుంటాను. మన ఇంటి సమస్య మనం పరిష్కరించుకుందాం. కాంగ్రెస్ గెలిచేది లేదు. డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నారు. అన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుపు ఖాయం అంటున్నాయి. హైకమాండ్ ఢిల్లీలో ఉండే పార్టీ కావాలా, గల్లీలో ప్రజల మధ్య ఉండే పార్టీ కావాలా ప్రజలు ఆలోచిస్తున్నారు’ అని మంత్రి అన్నారు.