5 లక్షల ప్రతిమలను తయారు చేయనున్న బీసీ సంక్షేమ శాఖ
మున్సిపాలిటీలు, వివిధ ప్రభుత్వ శాఖలకు బీసీ శాఖ లేఖ
ఇప్పటికే శాలివాహనులకు శిక్షణ ఇప్పించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో మట్టి గణపతి ప్రతిమలను తయారు చేసేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కసరత్తు చేస్తున్నది. పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణ కోసం మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలన్న డిమాండ్ పెరగడం, హైకోర్టు సైతం మట్టి విగ్రహాలనే వినియోగించాలని మార్గదర్శకాలు జారీచేయడంతో 5 లక్షల మట్టి ప్రతిమలను తయారు చేయనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ ప్రకటించింది. ప్రతిమలు అవసరమైన వారు తమను సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఇటీవల వివిధ ప్రభుత్వ శాఖలకు, మున్సిపాలిటీలకు లేఖలు రాశారు.
శాలివాహనులకు ఉపాధి
ప్లాస్టిక్ ఆగమనంతో తీవ్రంగా నష్టపోయిన శాలివాహనులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. అందులో భాగంగా కుమ్మరి వృత్తిదారులను గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ర్టాలకు తీసుకెళ్లి అక్కడ మట్టితో తయారు చేస్తున్న వస్తువులపై అవగాహన కల్పించింది. కుమ్మరి ఫెడరేషన్ పరిధిలోని 2,076 కుమ్మరి/శాలివాహన సహకార సంఘాల్లో గల 31 వేల మంది సభ్యులకు కులవృత్తిలో ఆధునిక నైపుణ్యాలు, యంత్రపరికరాల వినియోగం వంటి అంశాల్లో శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నది. ఆధునిక యంత్రపరికరాలను తెప్పించి, వాటితో మట్టి గణపతులతోపాటు మట్టి పాత్రల తయారీపై తొలివిడతగా 350 మంది వృత్తిదారులకు శిక్షణ ఇప్పించింది. ఇప్పుడు వారితోనే 5 అడుగుల వరకు ఎత్తైన మట్టి గణపతి ప్రతిమలను తయారు చేయించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది.