హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : ఎంసెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది రెండు విడతల్లో బీ ఫార్మసీ, ఫార్మా – డీ, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. మొదటి విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 2 నుంచి, తుది విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభిస్తారు.
తాజా సమాచారం ప్రకారం 72 కాలేజీల్లో 2,473 బీ ఫార్మసీ, మరో 38 కాలేజీల్లో 412 ఫార్మా -డీ సీట్లున్నాయి. కాకతీయ వర్సిటీ పరిధిలోని ఫార్మసీ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చేందుకు మూడు నాలుగు రోజులు పట్టవచ్చని అధికారులు తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను సెప్టెంబర్ 24న విడుదల చేస్తామని తెలిపారు.