రవీంద్రభారతి, మే 29(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో మాదిగలకు ఎందుకు స్థానం కల్పించలేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్టీఎస్) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కమిటీలో ఇద్దరు బీసీలు, ఇద్దరు రెడ్లు, ఒక ఎస్సీ మాల సామాజికవర్గం, ఒక లంబాడీ సామాజికవర్గానికి చెందినవారిని నియమించడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ తెలంగాణలో మెజారిటీ వర్గమైన మాదిగలకు స్థానం కల్పించకపోవడం సరైంది కాదని అన్నారు. శుక్రవారం బషీర్బాగ్ దేశోద్ధ్దారక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ మాట్లాడారు. తెలంగాణ మలిదశ పోరాటంలో అరెస్ట్ అయిన ఏడుగురు విద్యార్థి ఉద్యమనాయకుల్లో అయిదుగురు మాదిగ సామాజికవర్గానికి చెందినవారేనని గుర్తుచేశారు. తెలంగాణ పోరాటంలో అత్యధిక కేసులు ఎదుర్కొన్నది సైతం మాదిగలేనని అన్నారు. అనేక అంశాలలో దళిత వ్యతిరేకిగా రేవంత్ సర్కార్ మారిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో మాదిగలు, దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ భవిష్యత్ పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.