ముషీరాబాద్, జూలై 4: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బీజేపీ నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆ పార్టీ మతతత్వ విధానాలను స్పష్టం చేశాయని ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. దళిత, క్రైస్తవ, ముస్లింల అభివృద్ధికి దోహదపడే ప్రసంగాలు, నిర్ణయాలు చేయలేదని, ఆరెస్సెస్ కార్యవర్గంలా సాగిందని మండిపడ్డారు. సోమవారం నగరంలో విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ లౌకిక, ప్రజాస్వామ్యం, భిన్న కులమతాలతో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న భారత్లో బీజేపీ పాలకులు మతాల పేరిట రెచ్చగొడుతూ విభజించు పాలించు అనే బ్రిటిష్ విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. జై శ్రీరామ్ అనే నినాదంతో సభలు నిర్వహిస్తున్నదని ఆరోపించారు. సమైక్యతకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి దళిత, క్రైస్తవులు, ముస్లింలు ఓటు ద్వారా సమాధానం చెప్పాలని వంగపల్లి పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మార్పీస్ నాయకులు పెట్ట పెంజర రమేశ్, కొల్లూరు వెంకట్, సంజీవ, వరిగడ్డి చందు, ఎల్లేశ్, శ్రీకాంత్, నాగరాజు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.