ముషీరాబాద్, నవంబర్ 11: మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్లు 28 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా మాదిగలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు మాదిగలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకొంటూ అభివృద్ధిని, ఆర్థిక స్థితిగతులను మార్చే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా కేసీఆర్ ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ మద్దతు ప్రకటించారని గుర్తుచేశారు. దళితుల ఆర్థిక అభివృద్ధికి రూ.లక్షలు వెచ్చిస్తున్న సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి పార్టీ బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశంలో సమూల మార్పులు తీసుకురావడం ఖాయమని స్పష్టంచేశారు. బీఆర్ఎస్కు దళితులు అండగా నిలుస్తారని, అదేసమయంలో కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు కొల్లూరు వెంకట్, చందు, తిరుమలేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.