ముషీరాబాద్, నవంబర్ 16: రాష్ట్రంలోని మాదిగలందరూ బీఆర్ఎస్కు ఓటువేసి గెలిపించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం విద్యానగర్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి ప్రతి ఏటా వేలాదిమంది దళిత బిడ్డలు విద్యావంతులై బయటకు వస్తున్నట్టు చెప్పారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా దళిత విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువులు కొనసాగించే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం తీర్మానం చేయడంతోపాటు సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి వర్గీకరణకు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. పూలే, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్న కేసీఆర్కు మాదిగలంతా అండగా ఉండాలని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నేతలు వరిగడ్డి చందు, జన్నారపు జీవన్, ధర్మారపు శ్రీకాంత్, నాగరాజు, సురేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.