తెలంగాణచౌక్, ఆగస్టు 2: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం బాగుందని ఎమ్మార్పీఎస్ నాయకులు సైతం సమర్థిస్తున్నారు. కరీంనగర్లో సోమవారం రాత్రి జరిగిన ఎస్సీల సమగ్రాభివృద్ధి సాధికారత సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సభలో దళిత నాయకుడు మేడి మహేశ్ దళితబంధు పథకాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. ‘గతంలో మంద కృష్ణ మాదిగ టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు మనందరం ఆ పార్టీకి ఓట్లు వేశాం. అద్దంకి దయాకర్ కాంగ్రెస్కు మద్దతిచ్చినప్పుడు అటు కూడా ఓట్లు వేశాం. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మనం మద్దతు ఇచ్చి ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేయాలి’ అని మేడి మహేశ్ వివరించే ప్రయత్నం చేస్తుండగా సభలో ఉన్న కొందరు ఆయనతో గొడవకు దిగారు. దీంతో మంద కృష్ణ మాదిగ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.