ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 13: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కీలక దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో టీఎస్పీఎస్సీ ద్వారా జరిగే ఉద్యోగ భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ కీలక దశలో ఉన్నందున దానిని సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. బౌద్ధనగర్ డివిజన్ పార్శిగుట్టలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణపై 17న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ జరపబోతున్నదని తెలిపారు.
వర్గీకరణకు మద్దతుగా ప్రధాన ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో కేంద్రానికి లేఖ రాయించాలని సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా మొదటి ప్రాధాన్యత అంశంగా ప్ర కటించిన వర్గీకరణకు కట్టుబడి ఉండాలని కోరారు. అన్ని నియామకాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు అవకాశం కల్పించాలని కోరారు. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులతో పాటు ఎమ్మెల్సీ పదవులను కేటాయించాలని డిమాండ్ చేశారు.