జగిత్యాల : కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. బీఆర్ఎస్ ఓడిపోవడపై దేశంలో చర్చ జరుగుతున్నదని రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి(MP Suresh Reddy) అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదని ప్రజలు బాధపడు తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament Elections) బీఆర్ఎస్కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో తెలంగాణ వాదం వినిపించడానికి నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్దన్ (Bajireddy Govardhan) గెలువాల్సిన అవసరం ఉందన్నారు.మోదీ రాక ముందు దేశంలో అప్పు రూ.63 లక్షల కోట్లు ఉంటే బీజేపీ వచ్చాక రూ.163 లక్షల కోట్లు అప్పు అయిందన్నారు.
అయినా దేశం పేదరికంలో 104వ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అదాని, అంబానీ చేతుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ఉందన్నారు. మాట మీద ఉండే నాయకుడు బాజిరెడ్డి. ఎంపీ అరవింద్ నిజామబాద్ అభివృద్ధిపై పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడారో చెప్పాలన్నారు. పసుపు బోర్డుపై బిల్లు పెట్టామని, వచ్చే జూన్లో రాజ్యసభలో చర్చ జరుగుతుందన్నారు. ప్రజలు ఆలోచన చేసి బీఆర్ఎస్ గెలిపించాలన్నారు.