Green India Challenge | విద్యార్థులకు విద్య, వికాసంతో పాటు ప్రకృతిపై అవగాహన కల్పించడం అందరి బాధ్యత అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. గండిపేటలోని పల్లవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఎంపీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా విత్తన బంతులు చేసి విసిరారు. కార్యక్రమంలో ఎంపీ విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ తయారు చేస్తూ వారిలో స్ఫూర్తిని నింపారు. అనంతరం విద్యార్థులతో కలిసి విత్తనబంతులను చల్లారు.
అనంతరం సంతోష్కుమార్ మాట్లాడుతూ ప్రయత్నం చిన్నదా.. పెద్దదా అన్నది విద్యార్థులు ఆలోచించొద్దన్నారు. చిన్న ప్రయత్నం జీవితంలో పెద్ద విజయాలను అందిస్తుందన్నారు. దానికి నిలువెత్తు నిదర్శనం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం భవిష్యత్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కొమురయ్య, డైరెక్టర్ యసస్వీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మెంబర్ రాఘవ, కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు.