రంగారెడ్డి : మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ( IITA ) ఆవరణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు, డీఐజీ తాప్సిర్ ఇక్బాల్ కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ట్రైనింగ్ అకాడమీ ఆవరణంలో పచ్చదనం పెంచడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు. 80 ఎకరాల ప్రదేశంలో చెట్లను నాటి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మొక్కలకు నీరు అందించేందుకు అకాడమీ ఆవరణలో రెండు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశామన్నారు.
అదేవిధంగా ఈ శిక్షణ కేంద్రంలో శునకాలకు ఇచ్చే శిక్షణ ప్రత్యేకమైనదని దేశంలో ఉన్న బీహార్, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుండి వచ్చి ఆ రాష్ట్రాల వారు శునకాలకు శిక్షణ అదేవిధంగా వీఐపీలకు భద్రత అధికారుల శిక్షణ తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. గత మూడు సంవత్సరాలుగా ఈ శిక్షణ కేంద్రంలో 15,000 మందికి వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రత్యేక శ్రద్ధతో నిర్మిస్తున్న యాదాద్రి టెంపుల్ సిటీకి ఇచ్చే భద్రత సిబ్బందికి కూడా ఇక్కడే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.
పచ్చదనం పెంచడం కోసం శిక్షణ అకాడమీలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యల గురించి, ఇస్తున్న శిక్షణ గురించి తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అధికారులను అభినందించారు. ముఖ్యంగా నీటి నిల్వ కోసం ప్రత్యేక చొరవ తీసుకొని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి భూగర్భజలాలు పెరిగే విధంగా చేసిన సిబ్బందిని అభినందించడం జరిగింది.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొక్కలు నాటిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు శ్రీనివాస్, కిషన్ రావు, కిరణ్ రావు, బాషా, మాధవరావు, డాక్టర్ మధుసూదన్, వాసుదేవ రెడ్డి, బీవీ రెడ్డి, శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ రాయ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.