ములుగు: వేడుక ఏదైనా మొక్క నాటాలనే ఆలోచన ప్రతిఒక్కరిలో తీసుకురావడంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ మొదటి విజయాన్ని సాధించిందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో మొక్కలు నాటడం గొప్ప విషయమన్నారు. ఆలోచనలను ఆచరణగా మార్చి లక్ష్య సాధన కోసం కృషిచేయడంలోనే నిజమైన విజయం ఉందన్న స్ఫూర్తిని బలంగా నమ్మడంతోనే ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాలకు దగ్గర చేయగలిగామని వెల్లడించారు. బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ములుగు ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (FCRI) ఆవరణలో సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఫారెస్ట్ కాలేజీలో విద్యను అభ్యసిస్తున్న వందలాది మంది విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలను మొక్కలు నాటడం ద్వారా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఆలోచనలను అశయాలుగా మార్చి వాటి సాధనకు కృషి చేయటం ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్ ఆచరణలో పెట్టారు. అదే స్ఫూర్తి నుంచి ప్రేరణ పొందుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. బీడుగా ఉన్న రాష్ట్రాన్ని స్వరాష్ట్ర సాధన తర్వాత హరిత మయంగా మార్చాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని తీసుకున్నారని, దానినుంచే స్ఫూర్తి పొంది తాను గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించాన్నారు. గత ఐదేండ్లుగా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు, అన్ని వర్గాలకు చేరుకోవటం చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా ఆకుపచ్చని ఫలితాలు కళ్లముందు కనిపిస్తున్నాయని చెప్పారు.
తెలంగాణలో హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతం చేసుకుని అదే మాదిరిగా.. దేశవ్యాప్తంగా ఆకుపచ్చని ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆ దిశగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సమాజంలోని అన్ని వర్గాలను మరింతగా భాగస్వామ్యం చేసేలా కృషి చేస్తుందని ఎంపీ అన్నారు. ఇప్పటి దాకా స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి ఎంపీ సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, ఫారెస్ట్ కాలేజ్ డీన్ ప్రియాంక వర్గీస్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్స్ కరుణాకర్ రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు సంతోశ్ కుమార్కు ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్న’ అంటూ కవిత ట్వీట్ చేశారు.
Wishing you a very happy birthday @MPsantoshtrs Anna 😊 https://t.co/BzNtZl7tjk
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 7, 2022