MP Santhosh Kumar | జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం పునర్ నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ సంతోష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయానికి మద్దతుగా, కోట్లాది మంది ఆంజనేయ స్వామి భక్తులకు బాసటగా కొండగట్టు ఆలయాన్ని అనుకుని ఉండే వెయ్యి ఎకరాల అభయారణ్యం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరఫున దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ తన నిర్ణయాన్ని ప్రకటించారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన సీఎం కేసీఆర్.. స్వరాష్ట్రం సిద్దించాకా గత ఎనిమిదేళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. సీఎం తపనను అతి దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆంజనేయుడి ప్రధాన లక్షణాలైన పరాక్రమం, విశ్వాసం కేసీఆర్ సొంతమని.. అభివృద్ధి నిర్ణయాల్లో పరాక్రమం, తెలంగాణ పట్ల ఆయన విశ్వాసం వెలకట్టలేనివని ఈ సందర్భంగా ఎంపీ కొనియాడారు.
‘అన్ని రంగాల్లో అభివృద్ధితోపాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సీఎం కాంక్షిస్తున్నారు. కాళేశ్వరం కట్టినా, యాదాద్రి పునర్ నిర్మాణం చేసినా, ఇప్పుడు కోటి మొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధి నిర్ణయమైనా కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం. చంద్రుడికో నూలుపోగు లాగా ఆయన వెన్నంటి, మద్దతుగా నిలవటం నాకు లభించిన వరంగా భావిస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని అంజన్న సన్నిధి వెన్నంటి ఉండే వెయ్యి ఎకరాలకు పైగా అభయారణ్యాన్ని దత్తత తీసుకుంటున్నాను’ అని సంతోష్ కుమార్ వివరించారు.
కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే కంపార్ట్మెంట్ 684లో 752 ఎకరాలు, 685లో 342 ఎకరాలు మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటున్నట్లు ఎంపీ ప్రకటించారు. మొదటి విడతగా కోటి రూపాయల వ్యయంతో ఈ వెయ్యి ఎకరాల అటవీ భూమికి మరింత పచ్చందాలు అద్దుతామని వెల్లడించారు. దశల వారీగా మిగతా నిధులు కూడా అందించి లక్షిత పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
కొండగట్టుతో బలమైన అనుబంధం..
‘చిన్నతనం నుంచే సీఎం కేసీఆర్ వెంట ఉన్న నాకు కొండగట్టుతో బలమైన అనుబంధం ఉంది. అనేక సార్లు ఆంజనేయుడిని దర్శించుకుని ఈ అటవీ ప్రాంతంలో సేదతీరిన అనుభూతులు ఉన్నాయి’ అని ఎంపీ అన్నారు.
పెద్ద ఎత్తున ఔషధ, సుగంధ మొక్కలు..
‘ఐదు వందల ఏళ్లకు ముందే అస్థిత్వంలోకి వచ్చిన కొండగట్టు ఆలయంలో ఈ అడవిలో లభించే సుగంధ మొక్కలు, చందనం చెట్ల నుంచే పూజలు జరిగేవని ప్రతీతి. మళ్లీ ఆ వైభవం కోసం ఈ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఔషధ మొక్కలు, సుగంధ మొక్కలు నాటుతాము’ అని ఎంపీ వివరించారు.
అటవీ ప్రాంతంలో ‘మంకీ ఫుడ్ కోర్ట్..
అటవీశాఖ ఆధ్వర్యంలో అటవీ భూమి సరిహద్దుకు రక్షణ చర్యలతో పాటు, అడవి లోపల పునరుజ్జీవన చర్యలు చేపడతామని ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడించారు. సహజ అడవి పునరుద్ధరణకు చెక్డ్యామ్ల నిర్మాణంతో పాటు, నేలలో తేమ పరిరక్షణ చర్యలు చేపడతామన్నారు. ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున సంచరించే కోతులను అటవీ ప్రాంతానికి పరిమితం చేసేలా పెద్ద ఎత్తున పండ్ల మొక్కలు నాటి ‘మంకీ ఫుడ్ కోర్టు’ ఏర్పాటు చేస్తామన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు.. పచ్చని ప్రకృతి మధ్య కాసేపు సేద తీరేలా పరిసరాలను తీర్చిదిద్దుతామన్నారు. మట్టితో వాకింగ్ ట్రాక్ తో పాటు, పగోడాలను ఏర్పాటు చేస్తామని ఎంపీ సంతోష్ కుమార్ వివరించారు.
ఏలక్ష్యంతోనైతే ముఖ్యమంత్రి కొండగట్టు పునర్ నిర్మాణం చేపడుతున్నారో.. దానికి మద్దతుగా తమ వంతు ప్రయత్నం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరఫున ఉంటుందని ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రకటించారు.
As the Honble CM Sri KCR garu announced renovation of #Kondagattu temple with 600 Crores, I thought, it will be fitting to adopt 1095 acres of Kodimyal Reserve Forest as part of #GreenIndiaChallenge. Will do the honours on the occasion of the legend’s birthday tomorrow. pic.twitter.com/zVoccyyDwm
— Santosh Kumar J (@MPsantoshtrs) February 16, 2023