Anasuya- Shivaji |హీరోయిన్లు వేసుకునే బట్టలు నిండుగా ఉండాలంటూ ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్పై సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించగా, కొందరు శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతుండగా, మరికొందరు మాత్రం ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో స్టార్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. శివాజీ కామెంట్స్పై అనసూయ ఘాటుగా స్పందించగా, ఆ తర్వాత ఆమె స్పందనపై శివాజీ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలోకి అనసూయ ఎందుకు వచ్చిందో తనకు అర్థం కావడం లేదని శివాజీ అన్నారు. అంతేకాదు, ఆమె రుణం తీర్చుకుంటానంటూ వ్యాఖ్యానించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
శివాజీ వ్యాఖ్యలపై మరోసారి అనసూయ స్పందించారు. ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా ఆమె తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. “నా శ్రేయోభిలాషులు కొందరు కొన్ని వీడియోలు షేర్ చేశారు. అవి చూసిన తర్వాత ‘అతి వినయం ధూర్త లక్షణం’ అనే మాట గుర్తుకొచ్చింది. అమ్మా, తల్లీ అంటూ చాలా సాఫ్ట్గా మాట్లాడేవాళ్లే ఎక్కువ డేంజర్ అని మా ఇంట్లో పెద్దలు నేర్పించారు. రీసెంట్గా చూసిన కొన్ని వీడియోలు అదే భావన కలిగించాయి” అంటూ అనసూయ వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ స్టోర్ లాంచ్కు వెళ్లినప్పుడు మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రమే తాను స్పందించానని అనసూయ తెలిపారు. “శివాజీకి ఆయన అభిప్రాయం ఉంది, నాకు నా అభిప్రాయం ఉంది. అందుకే మాట్లాడాను. కానీ ప్రెస్ మీట్లో విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. ఫెమినిజం గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఫేక్ ఫెమినిజం అనేది లేదు. ఫెమినిజం అంటే అందరూ సమానంగా ఉండాలి. అబ్బాయిలు కూడా ఫెమినిస్టులే కావచ్చు” అని ఆమె స్పష్టం చేశారు.
ఆడవారి బట్టల గురించి మాట్లాడటమే చేతగానితనానికి నిదర్శనమని అనసూయ తీవ్రంగా వ్యాఖ్యానించారు. “తమపై తమకు నియంత్రణ లేకపోతే, అదే నియంత్రణను ఇతరులపై రుద్దే ప్రయత్నం జరుగుతుంది. నేను కూడా హీరోయిన్నే, ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ చేసిన అనుభవం ఉంది. మీకు నేను ఎలా బట్టలు వేసుకోవాలో చెబుతున్నానా? మీరు మాత్రం మాకు ఎలా వేసుకోవాలో చెబుతున్నారు. మేము చిన్న పిల్లలం కాదు. గ్లామరస్గా ఉండాలనుకోవడం మా హక్కు” అని అన్నారు. కేవలం సారీ చెప్పడం సరిపోదని అనసూయ స్పష్టం చేశారు. “ఆ టోన్లోనే మీ నిజస్వరూపం బయటపడింది. నిజంగా ధైర్యం ఉంటే మగవాళ్ల ప్రవర్తనపై ప్రశ్నించాలి. అంతేకాని హీరోయిన్లపై పడటం ఎందుకు? ఆడవాళ్లు ఇలా బట్టలు వేసుకోవద్దని ఎక్కడైనా రాసి ఉందా? బట్టలు కాదు, క్యారెక్టరే ముఖ్యం. అది ఉంటే సమస్యలు రావు” అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారగా, శివాజీ–అనసూయ మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.