హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రైతుకు హాని చేసే ఏ చర్యనూ తాము ఒప్పుకోబోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టబోమని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఎనర్జీ కన్వర్జేషన్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన లోక్సభలో మాట్లాడారు. ఈ బిల్లును బిల్లును మామూలుగా చదివితే ఫర్వాలేదనిపిస్తుందని, కానీ ఈ బిల్లు సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న బలవంతపు విధానాలతో దేశం మరింత వెనుకబడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై కేంద్రం విషం చిమ్మాలని చూస్తున్నదని మండిపడ్డారు. కేంద్రం పదే పదే చెప్తున్న డబుల్ ఇంజిన్ సరార్ కన్నా, తెలంగాణ సింగిల్ ఇంజిన్ సర్కార్ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నదని చెప్పారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్తుపై రాష్ర్టాలను సంప్రదించకుండా కేంద్రం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నదని ఆక్షేపించారు. రాష్ర్టాల హక్కులను కాలయాలని చూస్తున్నదని ఆరోపించారు. కొత్త విద్యుత్తు చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని గుర్తుచేశారు. కొత్త విద్యుత్తు చట్ట సవరణ రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నదని తేల్చి చెప్పారు.
దీనిద్వారా రాష్ర్టాల ఆర్థిక స్వయంప్రతిపత్తిని కేంద్రం సవాలు చేస్తున్నదని వెల్లడించారు. రాష్ర్టాల స్థితిగతులు, వినియోగం, జరిమానాను కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవటం వల్ల వినియోగదారులపై తీరని భారం పడుతుందని వివరించారు.
విభజన చట్టంలో ఏపీ విద్యుత్తు ఉత్పత్తిలో ఏపీ, తెలంగాణ మధ్య 54:46 నిష్పత్తిలో పంపిణీ చేయాలని ఉన్నదని, దాన్ని ఏపీ అమలు చేయటం లేదని విమర్శించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీల సమస్య తీవ్రంగా ఉన్నదని, దాన్ని అధిగమించేందుకు కేంద్రం ప్రతిపాదనలు రూపొందించలేదని ఆరోపించారు. తాము లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు.