హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మన బడి’లో ఎన్నారైలు భాగస్వాములు కావాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జీ రంజిత్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం లండన్లో తెలంగాణ జాగృతి ఎన్నారై యూకే టీం ఆధ్వర్యంలో ‘ఎట్ మీట్ అండ్ గ్రీట్ విత్ రంజిత్రెడ్డి’ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర పథకాలు, అమలు తీరుపై యువ ఎన్నారైలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూకేలో నివసిస్తున్న ఎన్నారైలు స్వగ్రామాల అభివృద్ధికి పాటు పడాలని కోరారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, యువతకు ఉపాధి అవకాశాలు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పగా, తాము సైతం సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతామని ఎన్నారైలు తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యూకే ప్రతినిధులు సుమన్రావు, రఘు జక్కుల, వంశీ, కిశోర్, మానస టేకుమట్ల, బాల్గోని వెంకట్, వంశీ తులసి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.