హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, అప్పుడే సమాజంలో సా మాజిక న్యాయం లభిస్తుందని, లేకపోతే ఏ మా ర్పు ఉండబోదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ చెప్పారు. జాతీయ బీసీ సం క్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద గురువారం నిర్వహించిన మహాధర్నాలో బడుగుల మాట్లాడుతూ.. మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే రెండింటిని మాత్ర మే అమలుచేశారని, రాజ్యాంగబద్ధమైన కమిషన్ సిఫార్సులకు విలువలేదా? అమలు చేయ రా? ఈ పేదకులాలు అభివృద్ధి చెందకూడదా? అని కేంద్రాన్ని నిలదీశారు. ఒకవైపు దేశం అభివృద్ధి చెందుతున్నా అందులో పేదకులాలకు వాటా దక్కడం లేదని వాపోయారు. ఇకనైనా బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ను దిగ్బంధిస్తాం: ఆర్ కృష్ణయ్య
మహిళా బిల్లులో బీసీ సబ్కోటా చేర్చాలని, బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా సభలో పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మహిళా బిల్లులో ఎస్సీ, ఎస్టీ, బీసీల సబ్కోటా చేర్చాలని, లేదంటే ఆ బిల్లుకు సార్థకత ఉండదని అన్నారు. రాజకీయాల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలని కోరారు. దేశంలో 56 శాతం జనాభా గల బీసీ కులాల బతుకుల గురించి పట్టించుకోరా? అని కేంద్రాన్ని నిలదీశారు. బీసీ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్లమెంట్ను దిగ్భంధిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. అనంతరం చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు, కులగణనతోపాటు అంశాలపై తీర్మానాలు చేశారు. ధర్నాలో ఎంపీ సంతోష్యాదవ్, దక్షిణాది రాష్ర్టాల అధ్యక్షుడు జబ్బల శ్రీనివాస్, సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ మారేశ్, ప్రధాన కార్యదర్శి బత్తుల వెంకటరమణ, మహిళా అధ్యక్షురాలు పద్మలత, బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.