హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం హైదరాబాద్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావుతో కలిసి తుమ్మల నివాసానికి వెళ్లారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయనతో వారు సుదీర్ఘంగా చర్చించారు. సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను తుమ్మల నాగేశ్వరరావుకు వివరించారు. పార్టీ మార్పుపై సర్ది చెప్పారు. పాలేరు అసెంబ్లీ టికెట్ ఆశించిన తుమ్మల.. అది దక్కకపోవడంతో పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. తుమ్మల పార్టీని వీడకుండా ఎంపీ నామా మొదటి నుంచి చొరవ తీసుకొంటున్నారు. తుమ్మలకు జిల్లాలో బాధ్యతలు అప్పగించడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ గెలుపు కోసం నామా ప్రయత్నిస్తున్నారు. పార్టీలోనే ఉండి, రానున్న ఎన్నికల్లో జిల్లాలో అన్ని సీట్లలో గెలిచి తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించేందుకు, జిల్లా అభివృద్ధిలో తమతో కలిసిరావాలని తుమ్మలను కోరారు. ఎంపీ నామా చేసిన ఈ ప్రయత్నం సత్ఫలితాలిచ్చిందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తుమ్మల తప్పక పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషిస్తారని నామా, భాస్కర్రావు ఆశాభావం వ్యక్తం చేశారు.