మహబూబ్నగర్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో ఓడిపోతామనే భయం సీఎం రేవంత్రెడ్డికి పట్టుకున్నదని, అందుకే పాలమూరు, వికారాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఇన్చార్జిగా ఉండలేక పారిపోయాడని పాలమూరు సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు.
శనివారం మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్లో, కోయిలకొండ మండలం శేరి వెంకటాపూర్, నర్వ మండల కేంద్రంలో గులాబీ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. సమావేశాలకు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డితో కలిసి ఎంపీ మన్నె హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్నగర్కు వచ్చిన సీఎం రేవంత్ తనపై లేనిపోని ఆరోపణలు చేశారని, విమర్శలు సీఎం స్థాయికి తగవని అన్నారు.
‘నేను మంచోడినని నువ్వేం కితాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. మంచాన పడ్డది నువ్వు.. నేను కాదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని తెలిసే మతిభ్రమించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావ్’ అని రేవంత్పై విరుచుకుపడ్డారు. మహబూబ్నగర్, చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జిగా సీఎం రేవంత్ ఎందుకు తప్పుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలుసో.. తెలియకో ఆశపడి కాంగ్రెస్కు ఓటు వేసినం దుకు ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో ప్రజలు సుభిక్షంగా బతికారని.. కాంగ్రెస్ పాలనలో నాలుగు నెలలకే కష్టాలు వెంటాడుతున్నాయని చెప్పారు. తాను ఎంపీ అయ్యాక తమ కంపెనీలో స్థానికులకు వెయ్యి ఉద్యోగాలు కల్పించానని, మళ్లీ గెలిపిస్తే ఇంకో వెయ్యి ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు రేవంత్ చేసిందేమిటో వివరించాలని డిమాండ్ చేశారు.