తెలంగాణను ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్తో పోలుస్తూ.. తెలంగాణ ఉద్యమ నేతలను టెర్రరిస్టులుగా సంబోధించిన వైఎస్ షర్మిలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. ప్రజా ప్రతినిధులను దొంగలు, బందిపోట్లు అని పరుష పదజాలంతో వ్యక్తిగత దూషణలు చేయడం సంస్కారహీనమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది.
షర్మిల వ్యాఖ్యలకు తెలంగాణ అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణ ప్రతినిధులు షర్మిల తీరుపై మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మలు ఎత్తుతరు.. కోలాటమాడుతరు.. బోనాలు ఎత్తుతరు.. అవసరమైతే బలితీసుకోవటానికి కూడా వెనుకాడరని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తీవ్రంగా హెచ్చరించారు. వైఎస్ షర్మిల తెలంగాణ అంతటా పొర్లు దండాలు పెట్టినా ఆమెను ఎవరూ నమ్మరని ఎంపీ మాలోత్ కవిత తేల్చిచెప్పారు.
షర్మిలది మొదటి నుంచి తెలంగాణకు ద్రోహం చేసిన కుటుంబం అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. వైఎస్ఆర్ నుంచి జగన్మోహన్రెడ్డి వరకు అందరూ తెలంగాణ ద్రోహులేనన్నారు. తెలంగాణలో కిరాయి మనుషుల పరాయి ఆటలు సాగవని హెచ్చరించారు.
మహిళలు మాట్లాడకూడని భాషను ఆమె మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. అభిమాన నాయకులు, మంత్రులపై ఇష్టానుసారంగా మాట్లాడితే అక్కడి ప్రజలు ఊరుకుంటారా? ఏపీకి వెళ్లి జగన్ను ఇదే తీరుగా విమర్శిస్తే వారు ఊరుకుంటారా?
– మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్ను పాకిస్థాన్తో పోల్చిన వైఎస్ షర్మిలకు తెలంగాణలో తిరిగే హక్కు ఎక్కడిది? దేశం గర్వించే రీతిలో తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ను తాలిబన్లతో పోల్చిన వ్యక్తిని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు. తెలంగాణలో కిరాయి మనుషుల పరాయి ఆటలు సాగవు.
– ప్రభుత్వ విప్ బాల్క సుమన్
వేల కోట్లు కూడబెట్టానని నాపై ఆరోపణలు చేశావు. నాకు ఆస్తులు ఎక్కడున్నాయో చెప్పాలి. మీ ఆస్తులను నేను బయటపెడతా. ప్రజలకు పంచడానికి సిద్ధంగా ఉన్నారా? విద్వేషాలు సృష్టిస్తే ఇక్కడి ప్రజలు ఊరుకోరు.
– ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మలు ఎత్తుతరు.. కోలాటమాడుతరు.. బోనాలు ఎత్తుతరు.. అవసరమైతే బలితీసుకోవటానికి కూడా వెనుకాడరని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. పాదయాత్రల పేరుతో తెలంగాణలో విషనాగులు తిరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు. వైఎస్ షర్మిల ఆడపిల్ల తీరుగా వ్యవహరించాలని హితవు పలికారు. హైదరాబాద్ను పాకిస్థాన్తో, తెలంగాణను ఆఫ్ఘనిస్థాన్తో పోల్చిన తర్వాత షర్మిలకు తెలంగాణలో ఏం పని అని నిప్పులు చెరిగారు. బుధవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎంపీ మాలోత్ కవితతో కలిసి సునీత మీడియాతో మాట్లాడారు. షర్మిల ప్రస్థానం ఎటువైపు అని ప్రశ్నించారు.
షర్మిల పాదయాత్ర సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మంత్రులను, చివరకు తండ్రి వయసున్న సీఎం కేసీఆర్ను కూడా నోటికొచ్చినట్టు తిడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు. షర్మిల రాజకీయాలకు పనికిరారని, వేరే పని చూసుకోవాలని సూచించారు. షర్మిల మాటలకు స్త్రీజాతి సిగ్గుపడుతున్నదని విమర్శించారు. ఒక ఆడపిల్ల వ్యవహరించే తీరుతో షర్మిల వ్యవహరిస్తే తమకేమీ అభ్యంతరం లేదని అన్నారు. షర్మిల మొదటి నుంచి తెలంగాణ పట్ల వ్యతిరేక వైఖరితో ఉన్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేసింది వైఎస్ కుటుంబమేనని గుర్తుచేశారు. షర్మిల వెనుక ఎవరున్నారో, ఆమెను ఆడిస్తున్నదెవరో సమయం వచ్చినప్పుడు చెప్తామన్నారు. ‘నిజంగానే కేసీఆర్ ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ అయితే తట్టుకోలగవా షర్మిలా?’ అని ప్రశ్నించారు. విభజన చట్టంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలపై షర్మిల ఎందుకు నిలదీయటం లేదని, దీని వెనుక ఆంతర్యం ఏమిటని గొంగిడి సునీత ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులను నోటికొచ్చినట్టు తిడితే సహించేది లేదని హెచ్చరించారు.
పొర్లు దండాలు పెట్టినా నమ్మరు
వైఎస్ షర్మిల తెలంగాణ అంతటా పొర్లు దండాలు పెట్టినా ఆమెను ఎవరూ నమ్మరని ఎంపీ మాలోత్ కవిత తేల్చి చెప్పారు. బయ్యారం గనులను దోచుకొన్న షర్మిల తెలంగాణకు మేలు చేస్తుందని ఎవరు అనుకొంటారని ప్రశ్నించారు. తెలంగాణను దోచుకోవటానికే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా వ్యక్తిగత విమర్శలు చేయటమే రాజకీయం అని భావిస్తే కేఏ పాల్కు వచ్చినన్ని ఓట్లు కూడా షర్మిలకు రావని స్పష్టంచేశారు. షర్మిల తన తన నోరు అదుపులో పెట్టుకోకపోతే 60 లక్షల సైన్యమున్న టీఆర్ఎస్ కార్యకర్తలను ఆపటం ఎవరి తరం కాదన్నారు. తీరు మార్చుకోకపోతే షర్మిలకు ఏం జరిగినా తమకు సంబంధం లేదని స్పష్టంచేశారు. ఏపీలో ఓటేసి తెలంగాణలో రాజకీయాలు చేస్తానంటే కుదరదని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలకు షర్మిల తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.