సూర్యాపేట : 76 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం గుర్తించని యాదవులను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి ఎన్నో విధాలుగా వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
వందల కోట్లు ఇచ్చిన ఇవ్వని రాజ్యసభ సభ్యుడి పదవిని ఒక చాయ్ ఖర్చు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో నాకు ఇచ్చారని గుర్తు చేశారు. నేడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి చేతులమీదుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించు కోవడంతో పాటు మరో 50 కోట్లు అదనంగా జిల్లా కేంద్రానికి తెచ్చుకున్నామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మిషన్ భగీరథ మంచినీరు అందించడమే కాకుండా మూడు లక్షల ఎకరాలకు సాగనీరు అందిస్తున్నమని చెప్పారు. జిల్లాలో ఒక బీసీ బిడ్డకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, జెడ్పీ వైస్ చైర్మన్, ఒక జనరల్ స్థానంలో ఎస్సీ మహిళను మున్సిపల్ చైర్మన్గా నియమించి న ఘనత మంత్రి జగదీష్ రెడ్డిదే అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేస్తున్న కుట్రలో వట్టే జానయ్య యాదవ్ ఇరుక్కున్నాడని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో ఉంటూ పార్టీని దెబ్బ కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా టిఆర్ఎస్ అండగా ఉంటుందని మాయ మాటలు చెప్పేవాళ్లను నమ్మకుండా యాదవులమంత కలిసికట్టుగా ముందుకు పోదామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దావుల వీరప్రసాద్ యాదవ్, మన్నే లక్ష్మీ నరసయ్య యాదవ్, కోడి సైదులు, జటంగి వెంకటేశ్వర్లు, చౌడయ్య యాదవ్, గొద్దేటి సైదులు, కడారి సతీష్ యాదవ్, మట్ట రాజు యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్, మండది కృష్ణ, తదితరులు ఉన్నారు.