జనగామ : జనగామ నూతన కలెక్టరేట్ను అధునాతన సదుపాయాలతో అద్భుతంగా నిర్మించారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసించారు. జనగామ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ఎంపీ కోమటిరెడ్డి పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఎక్కడా లేని విధంగా నూతన కలెక్టరేట్లు నిర్మిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా ఈ విధంగా నిర్మించలేదు. జనగామ కలెక్టరేట్ భవనం అత్యంత అద్భుతంగా నిర్మించారు అని ఎంపీ కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు జనగామ జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
చేర్యాలలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎంను ఆయన కోరారు. జనగామకు మెడికల్, పాలిటెక్నిక్ కాలేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండింటిని సీఎం తప్పకుండా ఇస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. కరోనా కారణంగా రాష్ట్రానికి సరైన ఆదాయం లేకపోయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలను కొనసాగిస్తోందన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టి మనం మనం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బస్టాండ్ను కూడా ఏర్పాటు చేయాలి. పరిపాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలను ఏర్పాటు చేసి, సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించడం పట్ల సీఎం కేసీఆర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు.