హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో కులం, మతాలు, భాషల పేరుమీద భేదాభిప్రాయాలు తీసుకురావడం బాధాకరమని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కే.కేశవరావు అన్నారు. కాషాయ దళం దేశంలో నూతన పోలరైజేషన్ తీసుకురావడం ఆందోళనకలిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు జాతీయవాదానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారని, దాన్నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. గణతంత్రం అంటే ప్రజలే తమ అవసరాలు తీర్చుకోవడమని, ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
లౌకికవాదం, సమానత్వం, సమసమాజ నిర్మాణం గణతంత్రం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. తెలంగాణలో గత ఏండేండ్లుగా ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజల కలలు సాకారమవుతున్నాయని చెప్పారు. అభివృద్ధి మన కళ్లముందు కన్పిస్తున్నదని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా తాగడానికి నీళ్లు అందించామన్నారు. ఆదిలాబాద్లో తాగునీటి ఇబ్బందులు, విషజ్వరాలు ఉండేవని, ప్రస్తుతం అలాంటి సమస్యలు లేవన్నారు.
మనిషికి నీళ్లు ఆహారం అందించాలని జాతిపిత గాంధీజీ చెప్పారని, తెలంగాణలో అవన్నీ సాకారమవుతున్నాయన్నారు. కాలేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు పైగా నీళ్లు అందిస్తున్నామని, రూపాయికే కిలో బియ్యం, రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసుకున్నామని, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మిడియం ప్రవేశపెడుతున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బండి రమేష్, లింగంపల్లి కిషన్ రావు, కట్టెల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.