న్యూఢిల్లీ : శ్రీలంక సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సమావేశంలో కేంద్ర మంత్రులు జైశంకర్, ప్రహ్లాద్ జోషితో పాటు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షోభంపై ప్రజెంటేషన్ కేంద్రం ఇచ్చింది. శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితికి కారణమైన రాజకీయ పరిస్థితులతో పాటు, స్థాయికి మించి అపరిమితంగా చేసిన అప్పులే కారణమంటూ కేంద్రం పేర్కొంది. అనంతరం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వగా.. దీన్ని టీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు, లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మండిపడ్డారు.
కేంద్రం అప్పులపై టీఆర్ఎస్ పార్టీ నిలదీసింది. తలసరి ఆదాయంలో దేశంలోనే రెండోస్థానంలో తెలంగాణ ఉందని సమావేశంలో టీఆర్ఎస్ నేతలు తెలిపారు. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అప్పులు గురించే మాట్లాడడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్తో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరిని విపక్షాలు తీవ్రంగా ఖండించారు. సందర్భం లేకుండా రాష్ట్రాల అప్పుల ప్రజెంటేషన్ ఏంటీ? అంటూ నిలదీశారు.
తెలంగాణ అప్పులు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఎఫ్ఆర్బీఎం 3.5శాతం పరిధిలోనే ఉన్నాయన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అప్పులు ఏకంగా 6.2శాతం దాటాయని మండిపడ్డారు. అప్పులు తీసుకున్నా.. చెల్లించడంలో తెలంగాణ ఏమైనా నిర్లక్ష్యం చేసిందా? అని ఎంపీ కేశవరావు నిలదీశారు. కేంద్రం చేసిన అప్పులకు సమాధానం ఎవరిస్తారని ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చ జరగాలని ఆయన ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.